మనసు మార్చుకున్న టీఎంసీ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ.. మమతకు క్షమాపణలు

  • అసన్‌సోల్ మునిసిపల్ చైర్మన్ పదవికి మొన్న రాజీనామా
  • మంత్రి అరూప్ బిశ్వాస్, ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అనంతరం యూటర్న్
  • రాజీనామా వెనక్కి తీసుకున్నజితేంద్ర
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వాతావరణం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. టీఎంసీ నేతలు రాజీనామాల బాటపట్టడం అధికార పార్టీని కలవరపరుస్తుంటే ఇదే అదునుగా రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాగా, మొన్న టీఎంసీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 24 గంటలు కూడా గడవకముందే మనసు మార్చుకున్నారు.

మంత్రి అరూప్ బిశ్వాత్‌తో భేటీ అయిన అనంతరం ఆయన పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. తాను టీఎంసీతోనే ఉంటానని స్పష్టం చేశారు.  అరూప్ బిశ్వాస్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జితేంద్ర క్షమాపణలు తెలిపారు. జితేంద్ర మనసు మార్చడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. అసన్‌సోల్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన జితేంద్ర తన పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా మనసు మార్చుకున్న  ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.

West Bengal
Mamata Banerjee
TMC

More Telugu News